Thursday, December 9, 2010

ఏమెట్టి పెంచారే నిన్ను

ఏమెట్టి పెంచారే నిన్ను 

రామ్‌గోపాల్‌వర్మ కలం చేతపట్టారు. ఇన్నాళ్లు తన సినిమాలకు కథలు, మాటలు రాసుకున్న ఆయన తొలిసారిగా ఓ పాట రాశారు. అదికూడా సాదాసీదా పాట కాదు. స్ర్తీ అందాన్ని వర్ణిస్తూ సాగే మాస్ మసాలా సాంగ్. సునీల్ హీరోగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్‌కుమార్ నిర్మాణంలో ఆయన రూపొందిస్తున్న ‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ చిత్రం కోసం ఆయన ఈ పాట రాశారు. కోటి స్వరసారథ్యంలో గీతామాధురి, సింహ ఈ పాటను ఆలపించారు. ఈ పాట బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. మరో పాటను వచ్చేవారం విడుదల చేస్తారు. తొలిసారిగా తాను రాసిన ఈ పాట గురించి రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ-‘‘విచిత్రమైన పరిస్థితుల నడుమ వచ్చే పాట ఇది. సినీరంగంలోకి అడుగుపెట్టిన అప్పల్రాజుకు తొలి ప్రయత్నంలోనే అదృష్టం లాంటి దురదృష్టం ఎదురవుతుంది. కష్టపడి రాసుకున్న గొప్ప కథకు సావిత్రి లాంటి అందం, ఆహార్యం, నటన గల నటిని అప్పల్రాజు ఊహించుకుంటుంటే... నిర్మాత మాత్రం అందాల ప్రదర్శన తప్ప ఇంకేమీరాని ఓ కమర్షియల్ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతాడు. దాంతో ఆ హీరోయిన్‌ను కలవడానికి షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్తాడు అప్పల్రాజు. అక్కడ ఆ హీరోయిన్, హీరోపై ఈ పాట చిత్రీకరణ జరుగుతుంటుంది. ఈ పాట సాహిత్యాన్ని, హీరోయిన్ ఎక్స్‌పోజింగ్‌ని చూసి అప్పల్రాజు కళ్లు, చెవులు రెండూ మూసుకుంటాడు. ఇదీ ఈ పాట సందర్భం’’ అని చెప్పారు వర్మ. ఇంకా ఆయన చెబుతూ- ‘‘నేను ఈ పాట రాయడానికి బలీయమైన కారణమే ఉంది.స్ర్తీని దేవుడు సృష్టించిన అత్యంత మహాసృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి నేను ఈ పాట రాశాను. కేవలం అమ్మాయిలను మాత్రమే పొగడకుండా అబ్బాయిలను కూడా పొగిడాను. కాకపోతే అమ్మాయిల గురించి నేను రాసిన ప్రతి మాటా నా హృదయంలోంచి వచ్చినవి. అబ్బాయిల గురించి రాసినవన్నీ... ఉత్తుత్తివి.’’ అంటూ చెప్పుకొచ్చారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ చిత్రానికి సహనిర్మాత: సుమన్ వర్మ, సమర్పణ: వందిత కోనేరు.

No comments:

Post a Comment